ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ అంగీకారం

  • మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ పడే సూచనలు
  • నెల రోజులపాటు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే
  • సైనిక సాయాన్ని అమెరికా పునరుద్ధరించిన నేపథ్యంలో కీలక పరిణామం
  • జెడ్డాలో 9 గంటల చర్చల అనంతరం దిగొచ్చిన ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఒర్నాట్ హోటల్‌లో దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనకు కీవ్ ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా దానిని పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

కాల్పుల విరమణకు కీవ్‌పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఉక్రెయిన్ దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో చర్చలకు మొగ్గు చూపడం ద్వారా రాజీకి ఆసక్తి కనబరిచారు. వైమానిక, సముద్ర దాడులపై పాక్షిక సంధిని ప్రతిపాదించారు. వేలాదిమందిని బలిగొన్న యుద్ధానికి నెల రోజుల పాటు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ప్రతిపాదనకు కీవ్ అంగీకరించినట్టు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. ‘‘మేమొక ఆఫర్‌ను తీసుకొచ్చాం. ఉక్రెయిన్ అందుకు అంగీకరించింది. కాల్పుల విరమణ పాటించడంతోపాటు తక్షణ చర్యలకు ముందుకొచ్చింది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. చర్చలకు ఉక్రెయిన్ దిగొచ్చిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Ukraine
Russia
Ceasefire
Ukraine-Russia War
Donald Trump

More Telugu News